విద్రోహ శక్తుల నుండి మన తెలంగాణను కాపాడుకుందాం: కేటీఆర్

  • జూన్ 2వ తేదీ తెలంగాణ చరిత్రలోనే అద్భుతమైన రోజు అన్న కేటీఆర్
  • తెలంగాణ ప్రగతి, ప్రజల సంక్షేమనే లక్ష్యంగా బీఆర్ఎస్ పని చేసిందని వ్యాఖ్య
  • తెలంగాణ అస్తిత్వానికి రక్షణ కవచంలా నిలబడిందన్న కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. దశాబ్దాల తరబడి సాగిన వివక్ష, అవమానాలు, అణచివేతకు ముగింపు పలికిన జూన్ 2వ తేదీ తెలంగాణ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన రోజని ఆయన అభివర్ణించారు. అమరవీరుల త్యాగాలు, ఉమ్మడి ఆత్మగౌరవ పోరాటం వల్లే తెలంగాణ ప్రజలు విముక్తి సాధించారని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.


ఉద్యమ కాలంలో వినిపించిన “తెలంగాణ వచ్చుడా... కేసీఆర్ సచ్చుడా” అనే నినాదాన్ని ప్రస్తావిస్తూ.. 60 ఏళ్ల సుదీర్ఘ కలని నిజం చేయడంలో తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు పోషించిన కీలక పాత్రను కేటీఆర్ కొనియాడారు. 14 ఏళ్ల పాటు సాగిన సుదీర్ఘ స్వరాష్ట్ర ఉద్యమంలో కానీ, ఆ తర్వాత తొమ్మిదిన్నరేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు కానీ, కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ఎల్లప్పుడూ తెలంగాణ ప్రగతి, ప్రజల సంక్షేమమే ఏకైక లక్ష్యంగా పనిచేసిందని స్పష్టం చేశారు. నేటికీ తమ పార్టీ ప్రజల గొంతుకగా నిలుస్తూ... తెలంగాణ అస్తిత్వానికి, ప్రగతికి ఒక రక్షణ కవచంలా నిలబడిందని పేర్కొన్నారు.


ప్రస్తుత కాంగ్రెస్ పాలన సాగుతున్న తరుణంలో ఆయన బీఆర్ఎస్ శ్రేణులకు ఒక ప్రత్యక్ష పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల సేవ కోసం ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త పునరంకితం కావాలని కోరారు. తెలంగాణను దెబ్బతీయాలని చూస్తున్న విద్రోహ, వ్యతిరేక శక్తుల నుండి మన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఈ ఆవిర్భావ దినోత్సవం సాక్షిగా మనమంతా మళ్లీ ఒకసారి ప్రతిజ్ఞ చేద్దామని కేటీఆర్ పిలుపునిచ్చారు. స్వరాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు ఈ సందర్భంగా ఆయన ఘన నివాళులర్పించారు.


KTR
KCR
BRS
Telangana Formation Day

More Telugu News